నేషనల్ డెస్క్: డ్యామ్లను ఆధునిక దేవాలయాలుగా పెద్దలు అభివర్ణించారు. తాగునీటికి, సాగుకు మూలాధారంగా వీటిని పరిగణిస్తారు. అయితే, ఐరోపాలోని పలు నదులు, కాలువలపై నిర్మించిన డ్యామ్లను అక్కడి అధికారులు పేల్చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకూ ఏకంగా 4,984 డ్యామ్లను బద్దలు కొట్టారు. కూల్చివేతల పర్యవేక్షణ కోసం డ్యామ్ రిమూవల్ యూరప్ (డీఆర్ఈ) పేరిట ఓ సంస్థనే ఏర్పాటు చేశారు.
శతాబ్దాల క్రితం నిర్మించి, ఇప్పుడు అంతగా వాడుకలో లేని పలు డ్యామ్లు, ఆనకట్టలు ఐరోపాలోని పలు దేశాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. నదులు, కాల్వల ప్రవాహానికి ఇవి అడ్డంకిగా మారడంతో నీటిలో పెరిగే అరుదైన చేపలు, జీవజాలానికి ప్రాణసంకటంగా పరిణమించాయి. ఐరోపాలో నిరుపయోగంగా మారిన డ్యామ్ల వల్ల మంచినీటిలో పెరిగే అరుదైన వలస చేపలు 93 శాతం తగ్గిపోయాయని ‘వరల్డ్ ఫిష్ మైగ్రేషన్ ఫౌండేషన్’ అంచనా వేసింది. దీంతో ఐరోపా సమాఖ్య దేశాలు కీలక నిర్ణయం తీసుకొన్నాయి. 25 వేల కిలోమీటర్ల పొడవున నదీ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా.. ‘2030 బయోడైవర్సిటీ స్ట్రాటజీ’ని రూపొందించాయి. ఈ క్రమంలోనే నిరుపయోగంగా ఉన్న డ్యామ్లను పేల్చేస్తున్నారు.
సాగుకు నష్టం జరుగదా?!
ఐరోపావ్యాప్తంగా సుమారు 12 లక్షల డ్యామ్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం నిరుపయోగమైనవే. తాగునీరు, విద్యుదుత్పత్తి, సాగుకు వీటి వల్ల అంతగా ప్రయోజనం ఉండటం లేదు. చాలా పురాతనమైనవి కావడంతో మరమ్మతు చేద్దామంటే బడ్జెట్ పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగిస్తే, ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితి. అంతకుమించి, ఈ డ్యామ్ల కారణంగా మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతున్నది. అందుకే చివరకు పేల్చివేతలకు అధికారులు నిర్ణయించారు.
ఏయే దేశాల్లో పేల్చివేతలు జరుగుతున్నాయి?
ఫ్రాన్స్, స్వీడన్, ఫిన్లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్, డెన్మార్క్, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఎస్టోనియా, జర్మనీ, ఇంగ్లండ్, వేల్స్.
ఐరోపాలోని మొత్తం డ్యామ్లు
12 లక్షలు
నిరుపయోగంగా మారినవి
1.8 లక్షలు
పేల్చివేయనున్న డ్యామ్ల లక్ష్యం
లక్ష
ఇప్పటి వరకు పేల్చేసినవి
4,984