న్యూఢిల్లీ, మార్చి 20: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హమీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా, ఎన్నికల గుర్తులు ఫ్రీజ్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ అశ్విని ఉపాధ్యాయ్ అనే పిటిషనరు సుప్రీంకోర్టును కోరారు. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇస్తున్న ఉచిత హామీలు ప్రజాస్వామ్య విలువల ఉనికికే ప్రమాదకరంగా మారాయని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ముందే తమ పిటిషన్ను విచారించాలని కోర్టును పిటిషనరు తరఫు న్యాయవాది విజయ్ హన్సారియా విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు.. ఇది ముఖ్యమైనదని, గురువారం విచారిస్తామని పేర్కొన్నది.