Rashmika Mandanna | హైదరాబాద్, జనవరి 26 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ప్రముఖ నటి రష్మిక మందన్నా డీప్ఫేక్ కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ (24)ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇతడే రష్మిక వీడియోను సృష్టించినట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా ఓ పెద్ద మిషన్నే నిర్వహించినట్టు అర్థమవుతున్నది. ఈ మిషన్లో భాగంగా పోలీసులు ఏకంగా 50 ఫోన్లు, 12 ల్యాప్టాప్స్, పలు కాల్ రికార్డులు, డిలీట్ చేసిన సోషల్మీడియా ఖాతాలు, ఓ డిలీటెడ్ ఈ మెయిల్ను క్షుణ్ణంగా విశ్లేషించినట్టు సమాచారం.
ఈ ఘటనపై నవంబర్ 10న పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, యూజర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో అభ్యంతరకరమైన ఆ వీడియోను పలు పేజీల నుంచి ఇన్స్టాగ్రామ్ తొలగించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్వో) బృందం.. ఢిల్లీలోని నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్తో కలిసి రివర్స్ అనలైజింగ్ సాంకేతికతతో రష్మిక నకిలీ వీడియోల షేరింగ్ను విశ్లేషించాయి. తద్వారా ఈ వీడియో ఏ డివైజ్ నుంచి తొలుత షేరింగ్ అయిందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. దాదాపు 500 సోషల్మీడియా ఖాతాలను క్షుణ్ణంగా విశ్లేషించిన బృందం.. చివరకు 20 మందిని ప్రశ్నించింది. పోలీసులకు మెటా బృందం సహకరించింది. అయితే, పోలీసుల విచారణకు హాజరైన పలువురు.. తాము ఆ వీడియోను ముందుగా ఎక్కడ చూశాం? ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేశాం? అనే విషయాలను చెప్పలేకపోయారు. దీంతో 40-50 ఫోన్లు, 10-12 ల్యాప్టాప్స్ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. రష్మిక పేర ఉన్న ఫ్యాన్ పేజీలు, ఐపీ అడ్రస్ల వివరాలను పోలీసులు సేకరించారు. నవీన్ను అరెస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు వరకు కూడా అతడే ఈ పని చేశాడా? అనే విషయంపై ఢిల్లీ పోలీసులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు.
రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్ పేజీని నడిపిన నవీన్ లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించాక హఠాత్తుగా ఆ పేజీని డిలీట్ చేయడం, పేజీని సృష్టించేందుకు వినియోగించిన ఈమెయిల్ అడ్రస్ను రద్దు చేయడం, రష్మిక ఫేక్ వీడియో, షేరింగ్ నంబర్ డాటాను కూడా తొలగించడంతో పోలీసుల అనుమానం నిజమైంది. ఐపీ అడ్రస్ ద్వారా నవీన్ ప్రాంతాన్ని ఎట్టకేలకు గుర్తించి చివరకు అదుపులోకి తీసుకొన్నారు.