ద్వారక: ఓ మైనర్ ఎస్యూవీని రాంగ్ రూట్లో వేగంగా నడపడం ఓ యువ ప్రతిభావంతుడి ప్రాణాలతో పాటు అతడి మిలియన్ డాలర్ కలను చిదిమేసింది. విషాదకరమైన ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఈ నెల 3న జరిగింది. మృతుడి ఇంట్లో అతడి గదిని పరిశీలించినప్పుడు అతడు రాసుకొన్న ప్రణాళికలు, అతడి ప్రతిభకు లభించిన పురస్కారాలు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించాయి. ‘సొంతంగా విమానం కలిగి ఉండాలి లేదా ఒక మిలియన్ డాలర్ల ఆస్తి కలిగి ఉండాలి’ అనేది మృతుడు సహిల్ ధనేశ్ర(23) కల. తన కలను నెరవేర్చుకోవడం కోసం అతడు బాగా చదివేవాడని అతడి గది నిండా ఉన్న పుస్తకాలు, ల్యాప్టాప్ తెలియజేశాయి. ‘వాళ్లు మొదటి తరగతిలో విమాన ప్రయాణం చేయాలనుకొంటారు. నేను ఒక విమానానికి యజమానిగా ఉండాలనుకొంటున్నాను’ అని అతడు తన గదిలోని పోస్టర్ మీద రాసుకొన్నాడు. అతడి గదిలో డజన్ల కొద్దీ పతకాలు వేలాడుతూ కనిపించాయి. ‘అత్యాశ ప్రతిభను జయిస్తుంది’, ‘2025 నా సంవత్సరం అవుతుంది’, ‘మిలియన్ డాలర్ల సంవత్సరం’ అని తన గది గోడల మీద అతడు రాసుకొన్న మాటలు అతడి కలలను పరిచయం చేశాయి.