Karnataka Seer | కర్ణాటకలో లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుఘ శరనారుకు చిత్రదుర్గలోని ఒక న్యాయస్థానం నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతన్న శివమూర్తి మురుఘ శరనారును శుక్రవారం సాయంత్రం పోలీసులు వీల్చైర్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా శుక్రవారం ఉదయమే ఆయన దవాఖానలో అడ్మిట్ అయ్యారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో శివమూర్తి మురుఘను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కేసు విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు వాదించారు.
పోలీసుల తీరుపై న్యాయస్థానం విమర్శలు గుప్పించింది. జైలుకు తరలించిన మఠాధిపతి శివమూర్తి మురుఘను చికిత్స కోసం దవాఖానకు తరలించిన విషయమై ఎందుకు సమాచారం ఇవ్వలేదని తప్పుబట్టింది. ఆయన వైద్య పరీక్షల నివేదికలు తమకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించింది.
తమ కస్టడీలో ఉన్న మఠాధిపతి శివమూర్తి మురుఘ ఆరోగ్య పరిస్థితి పట్ల జాగ్రత్త తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తేనే దవాఖానకు తీసుకెళ్లాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరో నిందితుడు రష్మీని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇద్దరు మైనర్ బాలికలు తమపై లైంగిక దాడి చేశాడని శివమూర్తి మురుఘ శరనారుపై ఆరు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.