న్యూఢిల్లీ, జూన్ 1: కొవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను రాందేవ్ బాబా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆరోపించింది. ఢిల్లీలో వైద్యులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన ఐఎంఎ.. రాందేవ్ బాబాను ‘దేశ వ్యతిరేకి’గా అభివర్ణించింది. ఆధునిక వైద్యంతో పాటు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాటున తన సంస్థలకు చెందిన ఉత్పత్తులను అమ్ముకోవాలని ఆయన చూస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని పలు దవాఖానల వైద్యులు మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భుజానికి, చేతులకు నల్ల బ్యాడ్జీలు, రిబ్బన్లు ధరించారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ‘బ్లాక్ డే’ నిర్వహించారు.
వాదోపవాదాలతో లాభంలేదు: సారస్వత్
అల్లోపతి, ఆయుర్వేదం మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాలతో ఎలాంటి ప్రయోజనమూ లేదని నీతిఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మంగళవారం తెలిపారు. ఈ రెండు భిన్నమైనవని, వైద్యానికి రెండూ అవసరమేనని పేర్కొన్నారు.