న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని(Ram Idol) కృష్ణశిలపై చెక్కిన విషయం తెలిసిందే. ఆ నల్ల రాయి వయసు ఎంతో తెలుసా? ఆ బ్లాక్ గ్రానైట్ సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేశ్ ఈ విషయాన్ని ద్రువీకరించారు. ఆ రాయిపై 51 ఇంచుల ఎత్తైన రాముడిని శిల్పి యోగిరాజ్ అద్భుతంగా చెక్కాడు. ఫిజియో మెకానికల్ పద్ధతి ఆధారంగా కృష్ణశిలపై టెస్టింగ్ నిర్వహించినట్లు వెంకటేశ్ చెప్పారు. భారత్లో నిర్మించే డ్యామ్లు, న్యూక్లియర్ ప్లాంట్లకు కావాల్సిన రాళ్లను ఎన్ఐఆర్ఎం సంస్థే టెస్టింగ్ చేస్తుంది.
ఆ నల్లటి గ్రానైట్ చాలా కాలం మన్నికగా ఉంటుందన్నారు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుదన్నారు. భారత ఉపఖండంలో తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ వేల సంవత్సరాల పాటు ఆ రాయి పదిలంగా ఉంటుందని వెంకటేశ్ తెలిపారు. అయితే భూమి ఏర్పడిన సమయంలో ఉద్భవించిన లావా చల్లబడిన తర్వాత ఇలా భారీ శిలలుగా మారుతాయని ఆయన అన్నారు. నల్ల గ్రానైట్ చాలా గట్టిగా ఉంటుందన్నారు.
అయోధ్య రాముడి కోసం వాడిన కృష్ణశిలను కర్నాటకలోని మైసూరు జిల్లాలో ఉన్న జయపుర గ్రామం గ్రానైట్ గనుల నుంచి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై క్వాలిటీ గ్రానైట్లు ఉంటాయి. విగ్రహం కోసం వాడిన గ్రానైట్ ప్రీ కాంబ్రియన్ యుగానికి చెందినట్లుగా భావిస్తున్నారు. దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితమే ఆ రాళ్లు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం భూమి సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన విషయం తెలిసిందే. అంటే అయోధ్య రాముడి విగ్రహం కోసం దాదాపు భూమి వయసులో సగం వయసు ఉన్న రాయిని ఎంపిక చేసుకున్నట్లు భావిస్తున్నారు.
నల్ల గ్రానైట్ లో ఉన్న గుణాల వల్ల ఆ రాయిని ఎలాగైనా చెక్కవచ్చు అని డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. రాయిలో సాంద్రత ఎక్కువగా అని, రంధ్రాలు పడే ఛాన్సు తక్కువ అని, ఇలాంటి గుణాల వల్ల ఆ రాయిలో క్రాక్స్ రావడం తక్కువే అని డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. బ్లాక్ గ్రానైట్ నీటిని పీల్చదు అని, అది కార్బన్తో కూడా రియాక్ట్ కాదని ఆయన తెలిపారు.
కొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయం కోసం సంప్రదాయ ఆర్కిటెక్చరల్ డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ శిలలను వాడామని, ఆధునిక శాస్త్రం, ఇంజినీరింగ్ విధానాల ద్వారా ఆ రాళ్లను మరింత మన్నికగా ఉండే రీతిలో ఆలయాన్ని తీర్చిదిద్దినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దాదాపు వెయ్యేళ్లు చెక్కచెదరకుండా ఉండే రీతిలో ఆలయాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.