IPC-Cr.PC Law | క్రిమినల్, ప్రొసీజర్, ఎవిడెన్స్ యాక్ట్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు షురూ కానున్న విషయం తెలిసిందే. క్రమంలోనే మూడు బిల్లులపై పార్లమెంటరీ కమిటీ నివేదికను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్కు సమర్పించింది. హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ పార్లమెంట్లో ఉప రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా మూడు బిల్లులకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. బ్రిటీష్ పాలనలో చేసిన చట్టాలను మార్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో పాటు ఎవిడెన్స్ యాక్ట్ మార్చబోతున్నది. గత ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్ (Cr.PC), ఇండియన్ ఎవిడెన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుల్లో మార్పులకు సంబంధించి సమగ్ర పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని చైర్మన్ను కోరారు. ప్రస్తుత చట్టాలను వలస వారసత్వంగా అభివర్ణించిన అమిత్షా.. కొత్తగా ప్రతిపాదించిన చట్టాలు న్యాయానికి ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే మూడు చట్టాల్లోని ప్రతిపాదిన మార్పులను పరిశీలించిన కమిటీ.. మూడు నెలల్లోనే నివేదికను సమర్పించింది.
కమిటీ రాజ్యసభ సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుండడంతో కమిటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ను కలిసి నివేదికను సమర్పించారు. భారతీయ శిక్షాస్మృతి, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలు భారతీయ నేర న్యాయశాస్త్రానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. అయితే, ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ పలు సవరణలను ప్రతిపాదించింది. దాదాపు 10 మంది ప్రతిపక్ష సభ్యులు సైతం సవరణలను సూచించారు. ప్రస్తుతం తీసుకురాబోతున్న చట్టం నిర్లక్ష్యం కారణంగా సంభవించే మరణాలపై మరింత కఠినమైన విధానం అవలంభించాలని కమిటీ సిఫార్సు చేసింది.
ప్రభుత్వోద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్న దోషులకు శిక్షను తగ్గించాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా.. దాన్ని ఏడాదికి తగ్గించాలని కమిటీ ప్రతిపాదించింది. చట్టం తరచుగా నిరసనకారులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుండగా.. సాధారణ నిరసనకారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని కమిటీ సభ్యులు సూచించారు. అలాగే లింగమార్పిడి వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయం లేని లైంగిక సంబంధాల కోసం శిక్షార్హమైన చర్యలతో పాటు ఇతర సిఫార్సులకు కమిటీ ఆమోదించింది.