న్యూఢిల్లీ: రాజ్యసభ(Rajya Sabha)లో ఇవాళ చంద్రయాణ్-3 సక్సెస్ గురించి చర్చ జరిగింది. చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగోవ దేశం భారత్ అని అన్నారు. చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండర్ను దింపిన తొలి దేశం మనదే అని తెలిపారు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్1 మిషన్ల సక్సెస్ను ఆయన ప్రస్తావిస్తూ.. ఆకాశం హద్దు కాదు అని, ఇది ఆరంభం మాత్రమే అని ప్రపంచానికి భారత్ చాటిందన్నారు. స్వదేశీ శాటిలైట్లనే కాకుండా, విదేశీ ఉపగ్రహాలను కూడా ఇండియా లాంచ్ చేస్తోందని చైర్మెన్ జగదీప్ తెలిపారు. జవనరి 2018 నుంచి నవంబర్ 2022 వరకు 177 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్ 424 విదేశీ శాటిలైట్లను లాంచ్ చేసిందని, దాంట్లో గత 9 ఏళ్లలోనే 90 శాతం శాటిలైట్లను ప్రయోగించినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ మాట్లాడుతూ.. భారతీయ అంతరిక్ష పరిశోధనలను అభివృద్ధి చేసేందుకు విక్రమ్ సారాభాయ్ .. ఇస్రోను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కేవలం అభివృద్ధి కోసమే ఇస్రో అంతరిక్షాన్ని వాడుకుంటున్నట్లు చెప్పారు. వెదర్ సమాచారం, కమ్యూనికేషన్, గ్రామీణ అభివృద్ధిపై ఇస్రో ఫోకస్ పెట్టిందన్నారు. గత ఆరు దశాబ్ధాల్లో క్రియేట్ చేసిన సామర్థ్యం మీదనే చంద్రయాన్-3 సక్సెస్ ఆధారపడి ఉన్నట్లు జయరాం రమేశ్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 సక్సెస్తో శాస్త్రవేత్తలు, సైన్స్ సంబరాలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. భారతీయ శాస్త్రవేత్తల్లో ట్యాలెంట్, సామర్థ్యం అధికంగా ఉన్నట్లు చెప్పారు. గడిచిన 9 ఏళ్లలో అంతరిక్ష శాఖకు బడ్జెట్ 142 శాతం పెరిగినట్లు తెలిపారు. 2013-14 సంవత్సరంలో ఆ శాఖకు కేవలం 5158 కోట్లు మాత్రమే కేటాయించారని, కాని ఇప్పుడు 13 వేల కోట్లకు చేరిందన్నారు.
నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు వల్ల చాలా లాభాలు జరిగినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.ప్రభుత్వేతర వర్గాల నుంచే ఆ సంస్థకు సుమారు 36 వేల కోట్ల నిధులు వచ్చినట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణ కీలక అంశమని, గడిచిన 10 ఏళ్లలో 389 శాటిలైట్లను ప్రయోగించేందుకు విదేశీ కంపెనీల నుంచి 200 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఇస్రో ఆర్జించినట్లు చెప్పారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల్లో జత కూడేందుకు అనేక దేశాలు తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు సరైన సమయంలోనే జీతాలు అందుతున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలు రావడం లేదని కాంగ్రెస్, టీఎంసీ ప్రచారం చేస్తున్నాయని, అసలు మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమకు పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారని మంత్రి వెల్లడించారు. పార్లమెంట్ను అబ్ధాలతో తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.