న్యూఢిల్లీ: రాజ్యసభ(Rajya Sabha)లో ఇవాళ గందరగోళం నెలకొన్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డేరిక్ ఒబ్రెయిన్ ప్రవర్తనపై రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ సీరియస్ అయ్యారు. బుధవారం లోక్సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ జగదీప్.. ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చారు. దీంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. సరైన ప్రవర్తన లేని డెరిక్ ఒబ్రెయిన్ను సభ నుంచి వెళ్లిపోవాలంటూ జగదీప్ ఆదేశించారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రెయిన్ పాల్పడినట్లు చైర్మెన్ జగదీప్ పేర్కొన్నారు. గందరగోళం మధ్య సభను 12 గంటలకు వాయిదా వేశారు.
విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన 28 నోటీసులను చైర్మెన్ తిరస్కరించారు. సెక్యూర్టీ ఉల్లంఘన అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపిన డెరిక్ను సభ విడిచి వెళ్లాలని ధంకర్ ఆదేశించారు. పేరు పెట్టి పిలిచిన సభ్యుడు కచ్చితంగా సభను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. డెరిక్ ప్రవర్తన ఏమాత్రం బాగా లేదని జగదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేసిన చైర్మెన్.. ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
లోక్సభలో సాగర్ శర్మ, మనోరంజన్.. ఇద్దరూ పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకి స్మోక్ క్యాన్లతో అటాక్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో అన్మోల్ షిండే, నీలమ్ దేవి.. కలర్ గ్యాస్ను స్ప్రే చేశారు. స్మోక్ అటాక్ ప్లాన్ చేసిన ఆరుగురిలో నలుగురు పార్లమెంట్లోకి వచ్చినట్లు పోలీసులు తేల్చారు.