న్యూఢిల్లీ: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనపై రాజ్యసభలో రభస చోటుచేసుకుంది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే నాగాలాండ్ ఫైరింగ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయమై తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాల చేశారు. దాంతో ఛైర్మన్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ప్రతిపక్ష ఎంపీలు తమ పట్టువిడువలేదు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నాగాలాండ్ ఫైరింగ్పై కేంద్రం ప్రకటన చేయాల్సిందేని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆదివారం సైనికులు.. ఉగ్రవాదులుగా పొరబడి 14 మంది సాధారణ పౌరులను కాల్చిచంపారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. పార్లమెంట్ను కూడా ఈ సెగ కుదిపేస్తున్నది.