చెన్నై: డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఇటీవల సయోధ్యకు తాను మధ్యవర్తిగా వ్యవహరించానన్న వదంతులను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిపారేశారు. ఆదివారం చెన్నైలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనని.. రాజకీయ మధ్యవర్తిత్వాల్లో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పదవిని చేపట్టిన జోసెఫ్ విజయ్పై తనకు ఎలాంటి అసూయ లేదని తెలిపారు.
‘ద్రవిడ పార్టీలు సుమారు 60 ఏండ్లు పాలించాయి. బహుశా ఒక మార్పు అవసరమై ఉండొచ్చు. ఆ మార్పును తీసుకురావడానికి విజయ్ సరైన స్థానంలో ఉన్నారు’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయ విజయాన్ని ప్రశంసిస్తూ.. సుస్థిర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా విజయం సాధించడం ద్వారా ఆ యువ నటుడు అపూర్వమైన ఘనతను సాధించారని పేర్కొన్నారు.