చెన్నై : రాజకీయ అరంగ్రేటంపై సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసిన అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు.
గవర్నర్తో 25 నుంచి 30 నిమిషాల పాటు మాట్లాడానని తెలిపారు. ఆర్ఎన్ రవి ఎక్కువ కాలం ఉత్తరాదిలోనే గడిపారు. అయితే ఆయన తమిళనాడుతో పాటు ఇక్కడి ప్రజలను ప్రేమిస్తారని చెప్పారు. తమిళుల కష్టాన్ని, నిజాయితీని గవర్నర్ ఇష్టపడుతారని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా, ఇక్కడి ఆధ్యాత్మికత అంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. తమిళనాడు సంక్షేమం ఏదైనా చేయడానికి సిద్ధమని రవి తనతో చెప్పారని రజనీకాంత్ స్పష్టం చేశారు.
ఇక రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయన్న రజనీకాంత్.. ఆ విషయాలను మీడియాకు వెల్లడించడం సరికాదన్నారు. అయితే భవిష్యత్లో తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్స్టార్ తేల్చిచెప్పారు. పాలు, పెరుగుతో పాటు ఇతర పదార్థాలపై జీఎస్టీ విధించడాన్ని మీరేలా చూస్తారని రజనీకాంత్ను మీడియా ప్రశ్నించగా.. నో కామెంట్ అని బదులిచ్చారు.
తాను నటించబోయే జైలర్ మూవీ షూటింగ్ ఆగస్టు 15 లేదా 22వ తేదీన ప్రారంభిస్తున్నట్లు రజనీకాంత్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని 2017లో రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ 2020, డిసెంబర్లో సూపర్స్టార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాపించడంతో పాటు ఇతర ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయ ప్రవేశం చేయడం లేదని నాడు రజనీకాంత్ స్టేట్మెంట్ ఇచ్చారు.