జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పాత బడ్జెట్ ప్రతిని ఆయన సభ్యులకు చదివి వినిపించారు. ఇది గమనించిన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దాంతో సభ కొన్ని గంటలు వాయిదాపడింది. ఆ తర్వాత సభ పునఃప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు.
బడ్జెట్ ప్రతులను ప్రభుత్వ అధికారులు హుటాహుటిన వెళ్లి అసెంబ్లీకి తీసుకొచ్చారని, అది నిబంధనలకు విరుద్ధమని, వాస్తవానికి రాష్ట్ర ఆర్థికమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి బడ్జెట్ ప్రతులను తీసుకురావాలని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లీక్ అయ్యిందని, కాబట్టి ముఖ్యమంత్రి కొత్త బడ్జెట్ను రూపొందించి సభ ముందుంచాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.
దాంతో సీఎం గెహ్లాట్ సభను క్షమాపణలు చెప్పారు. తాజా బడ్జెట్ ప్రతులతో పొరపాటున గత బడ్జెట్కు సంబంధించిన అదనపు ప్రతి కలిసిందని, చూసుకోకుండా అది చదివినందుకు క్షమించాలని కోరారు. అయినా బీజేపీ ఎమ్మెల్యేలు గోల చేయడంతో.. సభ్యులందరికీ ఇచ్చిన బడ్జెట్ ప్రతులు, ప్రస్తుతం తన చేతిలో ఉన్న బడ్జెట్ ఒక్కటే అయినప్పుడు బడ్జెట్ పత్రాలు లీకయ్యాయనండంలో అర్థం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.