జైపూర్: అరుదైన ‘గులాబీ’ చిరుత దేశంలో తొలిసారి కనిపించింది. రాజస్థాన్ ఆరావళి పర్వతాల్లోని రణక్పూర్ ప్రాంతంలో తొలిసారిగా ఈ అరుదైన గులాబీ రంగు చర్మం ఉన్న చిరుత పులిని గుర్తించారు. విస్తారమైన అటవీ ప్రాంతంలో స్ట్రాబెర్రీ రంగు చిరుతపులిని అప్పుడప్పుడు చూసినట్లు రణక్పూర్, కుంభాల్గఢ్కు చెందిన స్థానికులు చెప్పేవారని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) ఫతే సింగ్ రాథోడ్ తెలిపారు. అయితే ఈ పింక్ చిరుత ఇటీవల కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారని ఆయన అన్నారు.
విభిన్న జాతి చిరుత పులుల్లో గులాబీ రంగు శరీరం ఉన్న చిరుత పులి ఒకటని రాథోడ్ తెలిపారు. 2012, 2019లో దక్షిణ ఆఫ్రికాలో తొలిసారి ఈ అరుదైన ‘గులాబీ’ చిరుతలను గుర్తించినట్లు వివరించారు. మరోవైపు, నాలుగు రోజుల శోధన తర్వాత ఈ గులాబీ చిరుతను ఫొటో తీసినట్లు వన్యప్రాణుల సంరక్షణ ఫొటోగ్రాఫర్ హితేష్ మోత్వాని తెలిపారు. దీని వయసు 5-6 ఏండ్లు ఉంటుందన్నారు.