జైపూర్: దేశంలో దళిత మహిళలపై అగాయిత్యాలు ఆగడం లేదు. వివాహిత మహిళను కొన్ని రోజులపాటు నిర్బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంజయ్ శర్మ అనే పూజారి బాధితురాలి కుటుంబంలో పూజలు చేసేవాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని తన మొబైల్లో రికార్డు చేశాడు. ఆ వీడియో చూపించి ఆ మహిళను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీడియోను వైరల్ చేస్తానని, ఆమె భర్తను, పిల్లవాడ్ని హత్య చేస్తామని బెదిరించాడు. అలాగే ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి కొందరు వ్యక్తులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను కొన్ని రోజుల పాటు నిర్బంధించి ఈ అగాయిత్యాన్ని కొనసాగించారు.
కాగా, ఆ మహిళ కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన నిందితుడు సెప్టెంబర్ 27న ఆమెను పోలీస్ స్టేషన్ వద్ద విడిచి పరారయ్యాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దీనిపై ఆరా తీసి ఈ నెల 7న కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన పూజారి సంజయ్ శర్మ కోసం పోలీసులు వెతుకుతున్నారు.