ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రయాణించిన వాహనం, ఆయన కాన్వాయ్ను శనివారం రాత్రి సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ఉన్న సిన్నార్ టోల్ ప్లాజా వద్ద అరగంటపాటు నిలిపివేశారు. ఐడీ కార్డులు చూపించాలని టోల్ గేట్ సిబ్బంది అడిగారు. దీంతో ఆగ్రహించిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఎంఎన్ఎస్ కార్యకర్తలు మూడు కార్లలో ఆ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. కర్రలు చేతబట్టి టోల్ గేట్ను ధ్వంసం చేశారు. అలాగే రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే కాన్వాయ్ను అడ్డుకున్న సిబ్బందితో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ వైరల్ అయిన వీడియో క్లిప్ ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
WATCH: #MNS Workers Vandalise Toll Plaza At Samruddhi Mahamarg After #RajThackeray 's Son Amit's Convoy Stopped#ahmednagar #amitthackeray #samruddhiexpressway #TollPlaza #Politics pic.twitter.com/05J6nXGEBL
— Free Press Journal (@fpjindia) July 23, 2023