ముంబై, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న లక్షలాది మంది తెలుగువారు ముంబైలోని చైత్య భూమిని సందర్శిస్తారని, వారి కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపాలని థాణే రైల్వేస్టేషన్ మాస్టర్కు బీఆర్ఎస్ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. కరీంనగర్, నల్గొండ నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని, ప్రస్తుతమున్న కొన్ని రైళ్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ… డిసెంబర్ 5న కరీంనగర్ -దాదర్(ముంబై), నల్గొండ -దాదర్ (ముంబై) వరకు, తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6న దాదర్ నుంచి కరీంనగర్, దాదర్ నుంచి నల్గొండ వరకు ప్రత్యేక రైళ్లను నడపాలని కోరారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకూ నడుస్తున్న అజంతా ఎక్స్ప్రెస్ 17063/4ను ప్రతి రోజూ ముంబై వరకు నడపాలన్నారు. ప్రతిరోజూ ముంబై, పన్వేల్ నుంచి నాందేడ్ వరకు నడుస్తున్న పన్వేల్ ఎక్స్ప్రెస్ 17613/4, రాజ్యరాణి ఎక్స్ప్రెస్ 17611/2 లను కరీంనగర్ వరకు పొడిగించాలని కోరారు. వారంలో ఒకసారి కాజీపేట-దాదర్ల మధ్య నడుస్తున్న 07195/6 ఎక్స్ప్రెస్ను క్రమబద్ధీకరించి, ప్రతిరోజూ నడపాలన్నారు. ఈ రైళ్లన్నింటినీ గంగాధర, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మోర్తాడ్, నిజామాబాద్, నాందేడ్, మన్మాడ్ స్టేషన్ల మీదుగా నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బుద్ది హేమంత్ కుమార్, కొంకణ, ముంబై విభాగ సోషల్ మీడియా ప్రచారకులు మహేంద్ర కంటే, థాణే లోక్సభ సహాయ సమన్వయకర్త దొనకొండ సంతోష్, నాయకులు ఉప్పరి శ్రీనివాస్, చంద్రకాంత్ నగరర్ తదితరులు పాల్గొన్నారు.