Mission Amanat | చాలామంది ట్రెయిన్లో బ్యాగ్లు మరిచిపోతుంటారు. ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. ప్లాట్ఫామ్స్ వద్ద రైలు ఎక్కే హడావుడిలో లగేజ్ మరిచిపోతుంటారు. లగేజ్ మరిచిపోయినా.. మిస్ అయినా ఇక అది దొరకదా? రైలులో మరిచిపోతే ఇక దాన్ని వదిలేసుకోవాల్సిందేనా? అందులో విలువైన వస్తువులు ఉంటే ఎలా.. అనే ప్రశ్నలు చాలామందికి వచ్చే ఉంటాయి. అటువంటి వాళ్ల కోసమే వెస్టర్న్ రైల్వే సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది.
రైల్వే ప్రయాణికుల కోసం.. వాళ్ల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం Mission Amanat అనే సర్వీస్ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా మిస్ అయిన లగేజ్ను.. దాని ఓనర్కు చేర్చడమే దాని లక్ష్యం. వెస్టర్న్ రైల్వేతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సంయుక్తంగా ఈ మిషన్ మీద వర్క్ చేస్తున్నాయి.
http://wr.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మిస్ అయిన లగేజ్ వివరాలను ఫోటోలతో సహా అప్లోడ్ చేస్తారు. తమ లగేజ్ మిస్ అయిన ప్యాసెంజర్లు.. ఆ వెబ్సైట్లోకి వెళ్లి అందులో లిస్ట్ అయి ఉన్న తమ లగేజ్ను చెక్ చేసుకొని ఆ లగేజ్ తమదే అని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం ఓనర్షిప్ ప్రూఫ్స్ చూపిస్తే చాలు. ఆ లగేజ్ను సంబంధిత యజమానికి అందజేస్తారు.
వెస్టర్న్ రైల్వే పరిధిలో 2021లో 1317 మంది రైల్వే ప్యాసెంజర్లకు 2.58 కోట్ల రూపాయల విలువైన లగేజ్ను ఆర్పీఎఫ్ సిబ్బంది అందజేశారు. అయితే.. పూర్తిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యాకనే సంబంధిత ఓనర్లకు లగేజ్ను సిబ్బంది అందజేస్తారు. దాని వల్ల.. లగేజ్ అందజేసే సమయంలో జరిగే ఫ్రాడ్ను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది.