న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా రైళ్లలో నిలిచిపోయిన క్యాటరింగ్ సేవలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు రైల్వేబోర్డు బుధవారం నిర్ణయం తీసుకున్నది. క్యాటరింగ్ సేవలను త్వరలోనే మిగతా రైళ్లలోనూ పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం చాలా ప్రత్యేక రైళ్లు రెగ్యులర్గా మారిన నేపథ్యంలో ప్రయాణికులకు త్వరలో భోజన సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానున్నది. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో రైళ్ల సేవలను పరిమితం చేసింది. ప్రయాణికులు మహమ్మారిన పడకుండా ఉండేందుకు రైల్వేశాఖ క్యాటరింగ్ సేవలను నిలిపివేసింది. ప్రస్తుతం చాలా సర్వీసులు, సాధారణ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని హోటల్స్, రెస్టారెంట్లు పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే ఉత్తరుల్లో తెలిపింది. అలాగే రైళ్లలో ప్యాంట్రీ కార్ల వ్యవస్థను సైతం పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆగ్రా డివిజన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన చార్జీల రాయితీపై రైల్వేశాఖ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.