Ashwini Vaishnaw: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎన్టీపీసీ ఫలితాల్లోని అవకతవకలపై బిహార్ అట్టుడికిపోతోంది. పలు రైల్వేస్టేషన్లలో అభ్యర్థులు బోగీలకు నిప్పు పెట్టి, ఆందోళనను తీవ్రతరం చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, వాటిని వెంటనే సవరించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదిరి ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఆర్ఆర్బీ చైర్మన్లందరూ అభ్యర్థుల సమస్యలను సావధానంగా వినాలని, వాటన్నింటినీ క్రోడీకరించి, కమిటీకి పంపాలని అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. దీని కోసం ఓ ఈమెయిల్ను కూడా ఏర్పాటు చేశామని, ఈ కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, ఫిర్యాదులను వింటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకూ ఈ కమిటీలకు విన్నవించే అవకాశం ఉంటుందని, వాటన్నింటినీ క్రోడీకరించి, మార్చి 4 న తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తుందని ఆయన వెల్లడించారు.
అయితే పరీక్షకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ లేవని, ఈ విషయంలో ప్రభుత్వం, రైల్వే బోర్డు అత్యంత జాగరూకతతో పనిచేస్తోందని వివరించారు. ఎన్టీపీసీ, గ్రూప్డీలో 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయితే కోటికి పైగానే దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అయితే చట్టాన్ని ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. వారు లేవనెత్తిన సమస్యలను, ఫిర్యాదులను తొందర్లోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రైల్వే ఆస్తులు ప్రజలందరివీ అని, వాటికి నష్టం చేకూర్చొద్దని విజ్ఞప్తి చేశారు.
రైల్వే బోర్డు, ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలు బిహార్ను కుదిపేస్తున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ అవకతవకలను నిరసిస్తూ అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెంటనే వాటిని సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజీపూర్ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా నడుస్తున్నాయి. పాట్నాలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష్పవాయువును కూడా ప్రయోగించారు.