న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం కూడా ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రాహుల్ గాంధీని ఇప్పటికే నాలుగు రోజులు ఈడీ ప్రశ్నించింది. గత సోమవారం నుంచి బుధవారం వరకు వరుసగా మూడు రోజులు సుమారు 30 గంటలపాటు పలు ప్రశ్నలు సంధించింది. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల 20 వరకు విరామం కోరారు. దీంతో ఆయన సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో పది గంటలపాటు రాహుల్ను ఈడీ ప్రశ్నించింది. దీంతో నాలుగు రోజుల్లో మొత్తంగా 40 గంటలపాటు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టింది. ఐదో రోజైన మంగళవారం కూడా రాహుల్ను ఈడీ ప్రశ్నించనున్నది.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ స్వాధీనం చేసుకోవడం, ఈ సందర్భంగా జరిగిన రూ.800 కోట్ల ఆర్థిక లావాదేవీలు, అవకతవకలపై సోనియా, రాహుల్ గాంధీని ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది.
మరోవైపు కరోనా సోకిన అనంతరం అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ ఈ నెల 23 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గురువారం ఈడీ కార్యాలయంలో హాజరుకానున్నారు.