న్యూఢిల్లీ, జూలై 12: అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు.. కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నట్టుగా ఉంది రాహుల్ గాంధీ తీరు. ఇటుచూస్తే.. కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎన్నికపై రేపు కీలక భేటీ జరుగనున్నది.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఈడీ సమన్లు ఇచ్చింది.. గోవా కాంగ్రెస్లో సంక్షోభం తలెత్తింది.. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. వీటన్నింటికీ తోడు సమస్యల వలయంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది.
ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ తనకేమీ పట్టనట్టు ఎంచక్కా యూరప్ పర్యటనకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చసాగుతున్నది. గురువారం కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎన్నిక విషయంలో కీలక చర్చలు జరుగనున్న సమావేశానికి రాహుల్ దూరంగా ఉండనుండటంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. అసలు ఆయనకు దేశ రాజకీయాలపై సీరియస్నెస్ ఉందా లేక పార్ట్టైం రాజకీయాలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అపహాస్యం పాలవుతున్నా..
విదేశాలకు వెళ్లినప్పుడల్లా రాహుల్ గాంధీ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ ఏడాది మేలో పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు నేపాల్లోని ఖట్మాండు వెళ్లినప్పుడు అక్కడ ఓ నైట్క్లబ్లో ఉన్న ఫొటోలను బీజేపీ మద్దతుదారులు బయటకు తెచ్చారు. పంజాబ్, యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆ ఎన్నికలకు ముందు కూడా డిసెంబర్లో ఇటలీ వెళ్లి.. జనవరిలో వచ్చారు. గత రాజ్యసభ ఎన్నికల వేళ ఆయన బ్రిటన్కు వెళ్లగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఇలా తీవ్ర సంక్షోభంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నప్పుడల్లా రాహుల్ విదేశాలకు వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. తనలోని నైరాశ్యాన్ని రాహుల్ ఇలా ప్రదర్శిస్తూ ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఏకంగా 247 పర్యటనలు
2015 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ దాదాపు 247 సార్లు విదేశాలకు వెళ్లారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభ సాక్షిగా ప్రకటించారు. గతంలో ఎస్పీజీ బిల్లుపై పార్లమెంటులో చర్చల సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సరాసరిగా చూసుకుంటే రాహుల్ ఏడాదికి 62 ట్రిప్పులు, నెలకు 5 ప్రయాణాలు చేశారని వివరించారు.