కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ నోటీసులు ఇవ్వలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దెప్పిపొడిచారు. ఇప్పుడిప్పుడు నోటీసులివ్వడం ప్రారంభించారని చురకలంటించారు. ”రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యారు. నోటీసులివ్వడం ప్రారంభించారు. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదు. రాహుల్ ఇప్పుడు నోటీసులివ్వడం ప్రారంభించారు. ఈ పరిణామం ఆనందదాయకం” అని ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు 26/11 దాడులను ఎలా ఎదుర్కొన్నారో తమకు బాగా తెలుసని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోందో కూడా తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీలిస్తున్నారని, అయితే ఢిల్లీలో ఏం చేశారో ఓ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ ప్రజలకు హామీలివ్వాలని ప్రహ్లాద్ జోషి అన్నారు.