కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకుండానే ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో పార్లమెంట్ సభ్యులందరూ విదేశాంగ శాఖ క్లియరెన్స్ తీసుకోవాల్సి వుంటుంది. ఏ ఎంపీ అయినా.. విదేశీ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్సైట్లో కనీసం మూడు వారాల ముందే వుంచాలి. ఈ నిబంధనను రాహుల్ గాంధీ బేఖాతర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. విదేశీ ప్రభుత్వాలు గనక ఎంపీలను పర్యటనకు ఆహ్వానిస్తే.. ఈ ఆహ్వానం విదేశాంగ శాఖ ద్వారా సదరు ఎంపీకి తెలుస్తుంది. ఒకవేళ… ఆయా విదేశీ ప్రభుత్వాలు గనక డైరెక్టుగా సదురు ఎంపీకే ఆహ్వానం పంపిస్తే.. విదేశాంగ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తేవాల్సి వుంటుంది. ఆ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ అత్యావశ్యకంగా తీసుకోవాలి. ఈ నిబంధనలను రాహుల్ పాటించలేదని సమాచారం.