కోవిడ్ మరణాల సంఖ్య విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు. కోవిడ్ మరణాల విషయంలో భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో తేడా వుందంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీన్ని ఉటంకిస్తూ రాహుల్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ అయినా సత్యాలు మాట్లాడాలి.. లేదంటే సత్యం చెప్పే వారినైనా మాట్లాడనివ్వాలి అంటూ ఎద్దేవా చేశారు. ‘ప్రధాని మోదీ సత్యాలు మాట్లాడరు. మాట్లాడేవారిని మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ మరణించలేదని ఇప్పటికీ చెబుతుంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 5 లక్షలు కాదు.. 40 లక్షల మంది కోవిడ్తో మరణించారని ముందు నుంచీ నేను చెబుతూనే వున్నాను. కోవిడ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
న్యూయార్క్ లెక్కలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం
భారత్లో కోవిడ్ మరణాల విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన న్యూయార్క్ టైమ్స్ను కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరణాల విషయంలో డబ్ల్యూహెచ్వో అనుసరించిన పద్ధతి తప్పని పేర్కొంది. తక్కువ జనాభా వున్న దేశాలతో, అత్యధిక జనాభా ఉన్న భారత్ను పోల్చడం సరికాదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.