ఝార్సుగూడ (ఒడిశా)/గాంధీనగర్, ఫిబ్రవరి 8: ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘మోదీ ఓబీసీ కుటుంబంలో పుట్టలేదు. వాస్తవానికి ఆయనది ఘంచి (తేలి) సామాజిక వర్గం. అయితే 2000 సంవత్సరంలో గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఘంచి సామాజికవర్గాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చారు. దీంతో మోదీ తనది ఓబీసీ సామాజికవర్గం అని చెప్పుకుంటున్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఓబీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లతో చేతులు కలుపడానికి కూడా ఇష్టపడని మోదీ బిలియనీర్లను మాత్రం హత్తుకుంటారని రాహుల్ విమర్శించారు. రోజుకు నాలుగుసార్లు దుస్తులు మార్చే మోదీ పేదవాడు కాదని తెలిపారు. ఒడిశాలోని అధికార బీజేడీ, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు. మరోవైపు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ స్పందిస్తూ ఘంచి సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. మోదీ ఇంటిపేరు విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గతంలో పూర్ణేశ్ మోదీ కేసు వేయగా రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం.. మళ్లీ తిరిగి పొందడం తెలిసిందే.