Rahul Gandhi | భారత్ జోడో యాత్ర ఈ రోజు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. తన యాత్రకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు దురదృష్టవశాత్తు పూర్తిగా విఫలం అయ్యారని తెలిపారు. తన పాదయాత్రలో దూసుకొస్తున్న జన సమూహాన్ని నియంత్రించడానికి అవసరమైన పోలీసులు ఎక్కడా కనిపించడం లేదని మీడియాకు చెప్పారు.
`నా భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగానిదే. జోడో యాత్ర కొనసాగే మిగతా రోజుల్లో భద్రత కల్పిస్తారని నేను ఆశాభావంతో ఉన్నా` అని రాహుల్ గాంధీ చెప్పారు. సెప్టెంబర్లో కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 30న శ్రీనగర్లో ముగియనున్నది.
`నేను ఈ రోజు నా పాదయాత్ర నిలిపేస్తున్నా. నా భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా ముందుకెళ్లలేను` అని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. `జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగంతో రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది చర్చలు జరుపుతున్నది. మిగతా కొన్ని రోజులు భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తీసుకునే చర్యలపై చర్చిస్తున్నది.` అని అన్నారు.