న్యూఢిల్లీ/వయనాడ్, ఏప్రిల్ 3: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఈ ఒక్క స్థానం నుంచి పోటీచేస్తారా? లేదా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన యూపీలోని అమేథీలో మళ్లీ బరిలో ఉంటారా? అనేదానిపై స్పష్టత లేదు. ఆ స్థానాన్ని మిత్రపక్షం ఎస్పీకి కేటాయించే అవకాశం ఉన్నదనే ప్రచారమూ మరోవైపు జరుగుతున్నది.
గత లోక్సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ను ఓడించిన కేంద్ర మంత్రి స్మృతిఇరానీ.. ఇప్పుడు నిను వీడని నీడను నేను.. అంటూ వయనాడ్లో కూడా అడుగు పెడుతున్నారు. అంటే ఆమె ఇక్కడ పోటీ చేయడం లేదు. వయనాడ్లో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ బరిలోకి దిగుతున్నారు. గురువారం సురేంద్రన్ నామినేషన్ దాఖలు చేయనుండగా.. ఈ కార్యక్రమానికి స్మృతిఇరానీ హాజరు అవుతున్నారు. తద్వారా ఉత్తరాదిన అమేథీలో రాహుల్ను ఓడించిన స్మృతిఇరానీని దక్షిణాదిన వయనాడ్కు పంపడం ద్వారా రాహుల్పై ఒత్తిడి తేవడమే కమలం పార్టీ వ్యూహమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.