న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు తదితర విషయాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
ముఖ్యంగా కొవిడ్ బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ, ఎయిర్ ఇండియా డిసిన్వెస్ట్మెంట్, ద్రవ్యోల్బణం, చైనాతో సరిహద్దు సమస్య, రైతుల సమస్యలు తదితర అంశాలను బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా అంశాల్లో మద్దతిచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి రెండు విడతల్లో జరుగనున్నాయి. జనవరి 31న తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 11న తొలి విడత ముగియనుంది. ఆ తర్వాత మార్చి 14న రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలై ఏప్రిల్ 8న ముగియనున్నాయి.