AAP | ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఆయన పటేల్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 30వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన నవంబర్ 2022లో ఢిల్లీ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లేబర్ ఎంప్లాయిమెంట్, కో ఆపరేటివ్ మంత్రితో పాటు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానన్నారు. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన.. ఇకపై పార్టీతో కలిసి పని చేయలేనని స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని.. ‘తానాషామీ హటావో.. సంవిధాన్ బచావో’ దివస్ను పాటించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన సందేశాన్ని పార్టీ నేతలకు సూచించిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇదిలా మండగా.. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కేజ్రీవాల్ పిటిషన్ను సోమవారంలోగా విచారించేందుకు ప్రత్యేక బెంచ్ ఏమీ లేదని సుప్రీంకోర్టు తెలిపింది.