న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్కుమార్ జిందాల్ ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకవైపు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
మరోవైపు బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం ఆదివారం నిరసన తెలిపింది. దోహాలోని భారత రాయబారి దీపక్ మిట్టల్కు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఆయనను తన కార్యాలయానికి పిలిపించింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేసింది. అయితే ఆ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భారత రాయబారి దీపక్ మిట్టల్ వివరణ ఇచ్చుకున్నారు. వారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికార పర్యటన కోసం ఖతార్కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఇది జరిగింది.
బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ వంటి దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలతో బీజేపీ అధిష్ఠానం దిగి వచ్చింది. జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్కుమార్ జిందాల్పై ఆదివారం వేటు వేసింది. నుపూర్ శర్మ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. నవీన్ జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ‘పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుంది. మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.