న్యూఢిల్లీ, మార్చి 24: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని కోరడానికి బదులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అందరూ ఉచితంగా చూస్తారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న మోదీ తన రాజకీయ లబ్ధికి ఇంకా సినిమాను వాడుకొంటున్నారని విమర్శించారు. సినిమాపై పన్ను ఎత్తేయాలని, ధరలు తగ్గితే అందరూ చూడటానికి అవకాశం కలుగుతుందని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘కశ్మీర్ పండిట్ల పేరు మీద కొందరు కోట్లు వెనకేసుకొంటున్నారు. మీరేమో ఆ సినిమా పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు’ అని బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. ‘హిట్లర్ కూడా తన కిందివాళ్ల కోసం ఏదో ఒకటి చేశాడు. కానీ మోదీ మీకేం చేశాడు? కేజ్రీవాలే ఎంతో కొంత చేశాడు. మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఔషధాలు ఇచ్చాడు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. బీజేపీని వీడి ఆప్లో చేరండి’ అని పిలుపునిచ్చారు.