Punjab Polls | పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మొత్తం 1304 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గరిష్టంగా లుధియానా జిల్లాలోని సాహ్నేవాల్, పాటియాలా రూరల్ స్థానాల నుంచి 19 మంది చొప్పున పోటీలో ఉండగా, దిన నగర్ నుంచి కనిష్ఠంగా ఐదుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దినా నగర్ నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రి అరుణా చౌదరి కూడా పోటీలో ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉన్నాయి. మొత్తం 2,266 మంది నామినేషన్లు దాఖలు చేశారని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ కరుణ రాజు తెలిపారు. పరిశీలన తర్వాత 588 నామినేషన్లు రద్దు కాగా, 341 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు. ఇక 1304 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 20న పోలింగ్ జరుగనున్నది. వచ్చేనెల 10న ఫలితాలు వెలువడతాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హేమాహేమీ నేతలెవరో చూద్దామా..!
అమృత్సర్ ఈస్ట్ స్థానం నుంచి పది మంది పోటీలో ఉన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్దూ, అకాలీ ప్రముఖుడు బిక్రం మాజిథియా ప్రధాన పోటీదారులు. సిద్దూను ఓడించడమే లక్ష్యంగా మాజిథియా పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది.
పాటియాల అర్బన్ స్థానం నుంచి మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరిందర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఈ స్థానం నుంచి 17 మంది పోటీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్లను బరిలో నిలిపాయి. ఆప్ నుంచి అజిత్ పాల్ కోహ్లీ, కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణు శర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అకాలీదళ్ అధినేత, అకాలీ-బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి సుఖ్బీర్సింగ్ బాదల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి జలాలాబాద్పై పడింది. ఈ స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మోహన్సింగ్ ఫాలియన్వాల్, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా జగ్దీప్ కంబోజ్ బరిలో ఉన్నారు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ సీఎం అభ్యర్థి భగ్వంత్ మాన్.. ధురి నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దల్వీర్ సింగ్ గోల్డీ పోటీలో ఉన్నారు.
చామ్కౌర్ సాహిబ్ స్థానం నుంచి ప్రస్తుత పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి చరణ్జిత్ సింగ్, అకాలీదళ్-బీఎస్పీ కూటమి అభ్యర్థిగా హర్మోహన్ సింగ్ తలపడుతున్నారు.
భాదౌర్ స్థానం నుంచి కూడా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు. 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా లాభ్సింగ్ ఉఘోకే, అకాలీదళ్ నుంచి సత్నాం సింగ్ రాహి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఐదు సార్లు సీఎంగా పని చేసిన మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తిరిగి లోంగ్ నుంచి పోటీలో ఉన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా గుర్మీత్సింగ్, ఖుడియన్, కాంగ్రెస్ నుంచి జగ్పాల్ సింగ్ అబుల్ఖురానా పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.