Tiffin Bomb | దీపావళి పండుగ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు సరిహద్దుల్లో ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు జలలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా, టిఫిన్ బాక్స్ బాంబు సంగతి బయటపడింది. అలీకే గ్రామంలో ఈ టిఫిన్ బాక్స్ బాంబును పోలీసులు వెలికితీశారు. జలాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.
ఈ పేలుడు కేసుతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్ అలియాస్ గోరాకు షెల్టర్ కల్పించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి విచారించారు. ఝుగ్గే నిహంగ వాలే గ్రామ వాసి జశ్వంత్ సింగ్ అలియాస్ షిండా బాబా, లుధియానాలో వాలిపూర్ ఖుర్డ్ వాసి బల్వంత్ సింగ్ అనే వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ సింగ్ అలియాస్ గోరాను కూడా అరెస్ట్ చేశారని పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్సింగ్ సాహోటా తెలిపారు.