న్యూఢిల్లీ: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, సిక్కు రాడికల్ నాయకుడు అమృత్పాల్ సింగ్ ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు పంజాబ్ స్పెషల్ పోలీస్ టీమ్.. అమృత్పాల్ సింగ్, ఆయన అనుచరుల అరెస్టుకు గాలింపు తీవ్రతరం చేసింది. మొత్తం ఏడు జిల్లాల్లో అమృత్పాల్, ఆయన అనుచరుల కోసం చేజింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు అమృత్పాల్ అనుచరులు అరెస్టయ్యారు.
ఈ క్రమంలో అమృత్పాల్ పారిపోయి జలంధర్ జిల్లా, షాకోట్ తాలూకా, మెహత్పూర్ గ్రామంలో దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో మెహత్పూర్ చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు అమృత్పాల్ సింగ్ అరెస్టుకు ఉపక్రమించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సేవలు నిలిపివేయబడుతాయని తెలిపారు.
కాగా, నటుడు దీప్ సిధూ ప్రారంభించిన వారిస్ పంజాబ్ దే అనే రాడికల్ ఆర్గనైజేషన్ను ప్రస్తుతం అమృత్పాల్ కొనసాగిస్తున్నాడు. దీప్ సిధూ గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అమృత్పాల్ను ముట్టడించిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు ప్రజలకు ట్విటర్ ద్వారా ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా సహకరించాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడేందుకే తాము పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని అభ్యర్థించారు.
Request all citizens to maintain peace & harmony
Punjab Police is working to maintain Law & Order
Request citizens not to panic or spread fake news or hate speech pic.twitter.com/gMwxlOrov3
— Punjab Police India (@PunjabPoliceInd) March 18, 2023