AAP and Sarari | నోరు జారిన పంజాబ్ మంత్రిపై ఆప్ అధిష్ఠానం చర్యలకు సిద్ధమైంది. ఆప్ నాయకత్వం జారీ చేసిన నోటీసుకు మంత్రి ఏ మాత్రం స్పందించకపోవడంతో.. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పంచే యోచనలో ఆప్ నాయకత్వం ఉన్నది. కాంట్రాక్టర్ల నుంచి డబ్బు దోచుకుంటున్నారంటూ మంత్రి సరారీ వ్యాఖ్యల ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఆప్కు తలనొప్పిగా తయారైంది. మంత్రి సరారీని మంత్రివర్గం నుంచి తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తన వ్యాఖ్యలతో పంజాబ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజాసింగ్ సరారీ ఆప్ ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడినట్లుగా చెప్తున్న ఆడియో క్లిప్పింగ్ వైరల్గా మారడంతో సరారీ నుంచి సంజాయిషీ కోరుతూ ఆప్ అధిష్ఠానం నోటీసు పంపింది. అయితే, నెల రోజులు కావస్తున్నా సరారీ ఆ నోటీసుకు స్పందించలేదని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. వీలైనంత త్వరగా మంత్రి సరారీపై చర్యలు తీసుకోవాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తున్నది. సరారీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి.
త్వరలో జరుగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మైలేజీ పొందేందుకు అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. నోటీసుకు సమాధానం ఇవ్వని మంత్రి వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఆప్ నాయకత్వం.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికే మొగ్గు చూపవచ్చునని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
సరారీపై చర్యలు తీసుకోవడం ద్వారా అవినీతి రహితంగా, నిజాయితీగా కనిపించేందుకు ఆప్ నాయకత్వానికి వీలు కలుగుతుంది.
పంజాబ్లో ఆప్ విషయాలను సీఎం భగవంత్ మాన్ చూస్తున్నందున.. సరారీ విషయంలో కూడా ఆయనే ఓ నిర్ణయం తీసుకుంటారని నాయకులు భావిస్తున్నారు. ఇలాఉండగా, తనదిగా చెప్తున్న వైరల్ ఆడియో క్లిప్ నకిలీదని మంత్రి సరారీ పేర్కొన్నారు. ఈ ఆడియో క్లిప్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.