PHD Sabzi wala | న్యూఢిల్లీ, జనవరి 1: పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 39 ఏండ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్డీ అందుకున్నారు. సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో వైరల్గా మారాయి. తన కూరగాయల బండికి ‘పీహెచ్డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు.
సందీప్ సింగ్ తొలుత పంజాబ్ యూనివర్సిటీ లా విభాగంలో 11 ఏండ్లపాటు కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేశారు. అయితే సమయానికి వేతనాలు సరిగా రాకపోవటం, అందులో కోతలు విధించటంతో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని అతడు వదిలేయాల్సి వచ్చిందట. ‘వేతనం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నా’ అని సందీప్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే టీచింగ్పై ఉన్న మక్కువ పోలేదని, కొంత డబ్బు పొదుపు చేసి.. ఏదో ఒక రోజు ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తానని తన ఆకాంక్షను వెలిబుచ్చారు.