న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. తన పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని ఆయన ప్రకటించారు. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అమరీందర్సింగ్ ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ బలవంతం మీద సీఎం పదవి నుంచి వైదొలిగారు. అమరీందర్ సింగ్ స్థానంలో హైకమాండ్ చరణ్జీత్ సింగ్ చన్నిని కొత్త సీఎంగా నియమించింది.
అప్పటి నుంచి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్లుగా ఉంటూ వచ్చారు. పార్టీ తనను అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించిందని పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. నాటి సీఎం అమరీందర్సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య విభేదాలే అమరీందర్ సీఎం పదవి కోల్పోయేలా చేశాయి. దాంతో అమరీందర్ సిద్ధూపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అమరీందర్ కాంగ్రెస్తో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు పుకార్లు రావడంతో ఆయన ఖండించారు. కాంగ్రెస్ తనను సంప్రదించాల్సిన సమయం ముగిసిపోయిందన్నారు.