చండీగఢ్: పంజాబ్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్నది. సీఎం భగవంత్ మాన్ సింగ్ శనివారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మంది భద్రతను ఉపసంహరించారు. ప్రస్తుతం ముప్పు అంచనా ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రుల కుటుంబ సభ్యుల సెక్యూరిటీని కూడా ఉపసంహరించారు. దీంతో పంజాబ్ తాజా మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబ సభ్యులు తమ భద్రతను కోల్పోనున్నారు. మరో ప్రముఖ నేత అయిన మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా భద్రతను కూడా తొలగించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ భద్రతను ఉపసంహరించారు.
కాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని ఆప్ ప్రభుత్వం తొలగించడం ఇది రెండోసారి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 122 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రతను ఉపసంహరించింది. ఈ మేరకు మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసింది.