చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ న్యాయవాది ఏపీఎస్ డియోల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పంజాబ్ నూతన అడ్వకేట్ జనరల్ నియామకం అనంతరమే తాను కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపడతానని సిద్ధూ పేర్కొన్న నేపధ్యంలో డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధి నిర్వహణతో పాటు అడ్వకేట్ జనరల్ కార్యాలయం విధులకు సిద్ధూ ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నవంబర్ 1న పంజాబ్ అడ్వకేట్ జనరల్గా వైదొలగిన డియోల్ సిద్దూ తీరును తప్పుపట్టారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు దుష్ర్పచారాన్ని సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధమైన పంజాబ్ అడ్వకేట్ జనరల్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధూ భ్రష్టుపట్టిస్తున్నారని డియోల్ ఆవేదన వ్యక్తం చేశారు.