అమృత్సర్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి విభేదాలు లేవని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని స్పష్టం చేశారు. మాజీ క్రికెటర్తో తనకు విభేదాలున్నాయని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. మీరు ఎక్కడికి వెళ్లినా మిమ్నల్ని తాను అనుసరిస్తానని సిద్ధూ సాబ్తో చెప్పానని సీఎం పేర్కొన్నారు. సిద్ధూతో కలిసి పనిచేస్తానని అన్నారు.
సీఎం ఇటీవల సిద్ధూపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జలంధర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చన్ని మాట్లాడుతూ ఎవరి పేరును ప్రస్తావించకుండా పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ వంద మంది ఎన్ని రకాలుగా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా మీ డ్యూటీ మీరు చేయండని అన్నారు.
సామాన్యుల సంక్షేమానికి తాను పనిచేస్తానని అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రజల సంక్షేమం కోసం తనవంతు పాలుపంచుకోవాలని వ్యాఖ్యానించారు. పోలీసులకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది తనకు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలుగా పరిగణిస్తానని సీఎం స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సిద్ధూ, చన్నీ మధ్య విభేదాలు కాంగ్రెస్ హైకమాండ్ను కలవరపరుస్తున్నాయి.