చండీగఢ్: పంజాబ్ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. చరణ్జీత్ సింగ్ క్యాబినెట్ సహచరులుగా మొత్తం 15 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. చండీగఢ్లోని రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
ఇక పంజాబ్ తాజాగా క్యాబినెట్లో ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు ఈ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అయితే, ఇసుక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్సింగ్కు మంత్రి పదవి ఇవ్వవద్దని ఆరుగురు ఎమ్మెల్యేలు లేఖలు రాసినా.. సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ ఆయనకు మంత్రిపదవి కట్టబెట్టేందుకే మొగ్గుచూపారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బ్రహ్మ్ మొహింద్రా, మన్ప్రీత్సింగ్ బాదల్, త్రిప్త్ రాజిందర్సింగ్ బజ్వా, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్జీత్సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ అషు, విజయ్ ఇందర్ సింగ్లా, రణ్దీప్ సింగ్ నభా, రాజ్కుమార్ వెర్క, సంగత్ సింగ్ గల్జియాన్, పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్కీరట్ సింగ్ కొట్లీ ఉన్నారు. రాణా గుర్జీత్సింగ్.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. అయితే ఇసుక కుంభకోణం ఆరోపణలు రావడంతో 2018 జనవరిలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.