న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 14వ తేదీన ఆ రాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని చర్చించేందుకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అవుతోంది. పంజాబ్ ఎన్నికల నిర్వహణపై తీసుకునే నిర్ణయాన్ని ఇవాళ మధ్యాహ్నం వరకు ఈసీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన ఎన్నికలను మార్చాలని ఆ రాష్ట్ర సీఎం చన్నీ సీఈసీకి లేఖ రాశారు. ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస్ జయంతి వేడుకలు ఉన్నాయని, ఆ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు చాలా మంది వారణాసికి వెళ్తారని, ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీని మార్చాలని సీఎం తన లేఖలో కోరారు. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా ఎన్నికల తేదీని మార్చాలని ఈసీఐని కోరింది.