పూణె: మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళకు మనిషి ఎముకల పౌడర్ను తినిపించారు. భర్తతో పాటు మరుదులు బలవంతంగా ఆమె చేత ఈ పని చేయించారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు అయ్యింది. పూణెకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో క్షుద్ర పూజలు చేయించిన పూజారిపై కూడా కేసు బుక్ చేశారు.
పూణె సిటీ పోలీసు డిప్యూటీ కమీషనర్ సుశైల్ శర్మ కేసు వివరాలను వెల్లడించారు. 498ఏ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు చెప్పారు. మూఢనమ్మకాల యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేసినట్లు వెల్లడించారు. వేర్వేరు అంశాల్లో మహిళ తన ఫిర్యాదును నమోదు చేసింది. 2019లో పెళ్లి సమయంలో భర్త, మరుదులు కట్నం డిమాండ్ చేసినట్లు ఓ కేసులో ఫిర్యాదు చేశారు. మూఢనమ్మకాల యాక్ట్ కింద రెండవ కేసు నమోదు చేశారు.
అమావాస్య రాత్రుల వేళ తనను శ్మశానాలకు తీసుకువెళ్లేవారని, ఆ శ్మశానాల్లో ఉన్న కాలిన బొక్కల పౌడర్ను తినిపించేవారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతానికి తీసుకువెళ్లి కూడా అఘోర పూజలు చేయించినట్లు ఆమె తెలిపింది. ఓ జలపాతం కింద బ్లాక్ మ్యాజిక్ చేయించినట్లు చెప్పింది. పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ మహిళ కుటుంబసభ్యలు బాగా చదుకున్నవారే అని, కానీ క్షుద్ర పద్ధతుల్ని అనుసరించినట్లు తెలుస్తోంది.