Pune airport : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకనాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పుణె విమానాశ్రయం పేరును మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పుణె విమానాశ్రయం పేరు మార్చారు. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ గా నిర్ణయించారు.
ఇప్పటివరకు ఈ విమానాశ్రయాన్ని లోహ్గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు. అయితే పుణెలోని విమానాశ్రయం పేరును మార్చాలనే సూచనను మురళీధర్ మోహోల్ ఇచ్చారు. ప్రస్తుతం అతను అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు పెట్టాలని, కొత్త విమానాశ్రయానికి ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరు పెట్టాలని మురళీధర్ తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక రోజు ముందు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. లోహ్గావ్ విమానాశ్రయం పేరును మారుస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను తదుపరి మంత్రివర్గంలో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో ప్రతిపాదనను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఫడ్నవీస్ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఎయిర్పోర్టు పేరు మార్పుపై ప్రధానితో చర్చిస్తానని చెప్పారు.