న్యూఢిల్లీ: కొడుకులు, కూతుళ్లకు సమాన హోదా కల్పించామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పురుషుల మాదిరిగానే మహిళలు పెళ్లి చేసుకునే కనీస వయస్సును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచేందుకు తన ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పారు. అలాగే తన ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలలో మహిళా సాధికారత ఒకటని అన్నారు. ఉజ్వల యోజన విజయానికి మనమే సాక్షులమని తెలిపారు. ముద్రా యోజన ద్వారా, మహిళల వ్యవస్థాపకత, నైపుణ్యాలు ఊపందుకున్నాయని చెప్పారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకంతో అనేక సానుకూల ఫలితాలు కనిపించాయని అన్నారు.
ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించడం ద్వారా అక్రమ పద్ధతుల నుండి ముస్లిం మహిళలకు విముక్తి దిశగా తన ప్రభుత్వం పయనిస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. అలాగే ముస్లిం మహిళలు పురుష సంరక్షకుడి(మెహ్రం)తో కలిసి హజ్కు వెళ్లాలన్న నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసిందని చెప్పారు.