జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈ నిరసన కొనసాగుతోంది. రాహుల్ భట్ అనే కశ్మీరీ పండితుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వొత్తులతో తమ నిరసనను వ్యక్తం చేశారు.
తమ తమ క్యాంపుల నుంచి కశ్మీరీ పండితులు బయటికి వచ్చి, రోడ్లను దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ ప్రాణాలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక ఉగ్రమూకల చేతిలో మరణించిన రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు కశ్మీరీ పండిట్లంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్కే లేదని, తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. మధ్యలో తాము బలి పశువులం అయిపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్మూ కశ్మీర్లో పండితులు ఏమాత్రం సురక్షితంగా లేరని, తీవ్ర భయాందోళనలకు తెర తీయాలని ఉగ్రవాదులు నిర్ణయించారని, అందుకే కశ్మీరీ పండితులను టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు. తమ భద్రత గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.
తన భర్తను చంపిన ఉగ్రవాదులను టార్గెట్ చేయాలని, రెండు రోజుల్లోగా వారిని క్రూరంగా చంపేయాలని మీనాక్షి భట్ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. ఆర్మీ అధికారులు కూడా తనకు ఇదే విషయాన్ని చెప్పారని ఆమె వెల్లడించారు. అయితే.. ఇలాంటి ఘటనలు జరగకముందే ఉగ్రవాదులను లేపేయాలని, వాళ్ల తిత్తి తీసేయాలని మీనాక్షి భట్ డిమాండ్ చేశారు.