అమృత్సర్, సెప్టెంబర్ 28: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు మరోసారి ఆందోళనకు దిగారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్ రోకో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఆందోళన గురువారం పంజాబ్ వ్యాప్తంగా కొనసాగింది.
మోగా, హోషియార్పూర్, గురుదాస్పూర్, జలంధర్, తరన్ తరన్, సంగ్రౌర్, పాటియాలా, ఫిరోజ్పూర్, బటిండా, అమృత్సర్ ప్రాంతాల్లో రైలు పట్టాలపై అన్నదాతలు బైఠాయించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఉత్తర భారతంలో భారీగా పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో గిట్టుబాటు కూడా కావడం లేదని తెలిపారు. పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ మూడు డిమాండ్లతో ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూడు రోజుల పాటు రైల్ రోక్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.