న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించారు. శుక్రవారం పలు మసీదుల్లో ప్రార్ధనల అనంతరం కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు.
ఢిల్లీ, యూపీ, కోల్కతాల్లో నిరసనలు మిన్నంటాయి. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జామా మసీదు వెలుపల నిరసనలకు దిగారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై బీజేపీ వేటు వేసిన అనంతరం ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరినా నిరసనకారులు నూపుర్ శర్మ అరెస్ట్కు డిమాండ్ చేశారు.
నమాజ్ సందర్భంగా కోల్కతాలో 300 మందికి పైగా నిరసనకారులు నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని నినదించారు. కాగా జామా మసీదు వద్ద నిరసనలకు తాము పిలుపు ఇవ్వలేదని జామా మసీద్ షాహీ ఇమాం తెలిపారు. మరోవైపు యూపీలోని పలు నగరాల్లో కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.